హైదరాబాద్‌కు భారీగా చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్లు

హైదరాబాద్‌కు భారీగా చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్లు

రష్యాలో తయారైన స్పుత్నిక్ V వ్యాక్సిన్లు మూడో విడతలో భాగంగా హైదరాబాద్‌కు మంగళవారం ఉదయం చేరుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో 56.6 టన్నుల వ్యాక్సిన్లు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి. స్పుత్నిక్ V వ్యాక్సిన్‌కు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. వీటిని మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. అందుకే ఎయిర్ పోర్టు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చిన కరోనా వ్యాక్సిన్లలో ఈ 56.6 టన్నులే అతిపెద్ద దిగుమతి. దీనిద్వారా భారతదేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సెంటర్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుందని ఎయిర్‌పోర్ట్ అధికారులు అన్నారు. 

కాగా.. స్పుత్నిక్ వ్యాక్సిన్ మొదటి విడతలో భాగంగా మే1న 1.5 లక్షల డోసులు వచ్చాయి. రెండో విడతలో మే 16న 60 వేల డోసులు వచ్చాయి. తాజాగా మూడో విడతలో జూన్ 1న 3 మిలియన్ల డోసులు హైదరాబాద్‌కు వచ్చాయి.