
- కాంగ్రెస్ తప్పులను మోదీ ఎత్తిచూపితే నీకేం బాధ: ఎంపీ లక్ష్మణ్
- రాష్ట్ర ఏర్పాటులో 1,200 మంది ప్రాణాలను కాంగ్రెస్ బలితీసుకోలేదా?
- కల్వకుంట్ల కుటుంబంలో అసహనం ఎక్కువైంది
- పాలమూరుకు ప్రధాని వస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నరు
- బీసీని ప్రధానిని చేసిన పార్టీ బీజేపీ..
- మీ పార్టీలో కనీసం అధ్యక్షుడినైనా చేస్తరా కవితమ్మ
- ఒక్క గ్రూప్ 1 పరీక్ష అయినా సరిగ్గా జరిపారా? అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టైమ్లో కాంగ్రెస్ చేసిన తప్పులను ప్రధాని నరేంద్రమోదీ ఎత్తి చూపితే మంత్రి కేటీఆర్కు అంత ఉలికిపాటు ఎందుకని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఏర్పాటులో 12 వందల మంది ప్రాణాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలి తీసుకుందని మోదీ అనడంలో తప్పేముంది? ఇంత మంది ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ కారణం కాదా? కాంగ్రెస్ తప్పులను ప్రస్తావిస్తే కేటీఆర్ కు ఎందుకంత బాధ?” అని మండిపడ్డారు. కాంగ్రెస్తో పోటీ పడి కేటీఆర్ బీజేపీని విమర్శిస్తున్నారని, కల్వకుంట్ల కుటుంబంలో అసహనం ఎక్కువైందని, అందుకే ఒకరిని మించి ఇంకొకరు ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మోదీ వ్యాఖ్యలను వక్రీకరించి రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై వ్యతిరేక భావన కలిగించేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. ‘‘ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని, కానీ.. తెలంగాణ ఏర్పాటు మాత్రం అలా జరగలేదని మోదీ ప్రస్తావించారు. దీనిపై కల్వకుంట్ల కుటుంబం అక్కసును వెళ్లగక్కడం ఏమిటి? కాంగ్రెస్ తప్పులను చెప్తే కేటీఆర్కు అంత ఉలికిపాటు ఎందుకు?” అని నిలదీశారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రూపు -1 పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించడం చేతకాలేదని ఆయనఅన్నారు.
కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు కేసీఆర్ అంగీకరించలేదా?
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని మోదీ పాలమూరుకు వస్తుంటే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని లక్ష్మణ్ అన్నారు. మోదీ క్షమాపణలు చెప్పిన తర్వాతనే రాష్ట్రానికి రావాలన్న కేటీఆర్ కామెంట్లను ఆయన తప్పుబట్టారు. ‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ప్రధాని క్షమాపణలు చెప్పాలా..? కేటీఆర్.. సమాధానం చెప్పు! పాలమూరు ప్రజలను మోసం చేసిన మీరు.. పాలమూరు –-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడటం సిగ్గుచేటు’’ అని ఆయన అన్నారు. కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉంటే.. 299 టీఎంసీలకు కేసీఆర్ అంగీకరించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘‘ప్రాజెక్టులను అడ్డంపెట్టుకుని కేసీఆర్ కుటుంబం కోట్లు గడిస్తున్నది నిజం కాదా? కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతలేరా?” అని మండిపడ్డారు. రాష్ట్రంలో లీకుల, లిక్కర్ ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు.
బీసీని మీరు సీఎం చేయగలరా కవితమ్మ
‘‘బీజేపీ.. బీసీ వ్యతిరేక పార్టీ అని ఎమ్మెల్సీ కవిత విమర్శిస్తే ప్రజలు నవ్వుకుంటున్నరు. బీసీని దేశానికి ప్రధానిని చేసింది బీజేపీ. మరి, బీసీని మీ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తుందా కవితమ్మ” అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ‘‘కనీసం బీసీని మీ పార్టీ అధ్యక్షుడ్ని కూడా చేయలేదు. రాష్ట్ర కేబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారో కవితమ్మ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. బీసీలకు ఎన్టీఆర్ 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే వాటికి బీఆర్ఎస్ గండికొట్టిందని అన్నారు. ‘‘34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించింది వాస్తవం కాదా? బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి?” అని ప్రశ్నించారు. గవర్నర్ విషయంలో బీఆర్ఎస్ నేతలు పోటీపడి విమర్శలు చేస్తున్నారని, వాళ్లు ఎమ్మెల్సీగా సిఫారసు చేసిన వ్యక్తులు నిబంధనల ప్రకారం అనర్హులని స్పష్టం చేశారు. గవర్నర్ కోటాలో కవులు, రచయితలు, కళాకారులు, సేవా కార్యక్రమాలు చేసే వారిని నియమించాలనే నిబంధనలు ఉన్నాయని చెప్పారు. బీజేపీని ఎవరూ విడిచి వెళ్లరని ఆయన అన్నారు.