- వైన్స్ల కోసం సిండికేట్!
- చక్రం తిప్పుతున్న నియోజకవర్గ స్థాయి లీడర్లు
- అనుచరులు, బినామీలతో దరఖాస్తులు
- రిజర్వ్ షాపులనూ దక్కించుకునేందుకు ప్రయత్నాలు
మహబూబ్నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్నగర్లో వైన్ షాపులు దక్కించుకునేందుకు నియోజకవర్గ స్థాయి లీడర్లు సిండికేట్గా ఏర్పడ్డట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు ఎలాగైనా షాపులు దక్కించుకోవాలని అనుచరులు, బినామీలతో దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. షాపులకు రెండేళ్ల కాల పరిమితి ఉండటం, ఆ లోగా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే చాన్స్ ఉండటంతో వీటిని వారి చేతుల్లోకి తీసుకునే ప్లాన్ చేసినట్లు తెలిసింది. గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన షాపుల్లోనూ వారే కర్చీఫ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయావర్గాలకు చెందిన కార్యకర్తలు, అనుచరులకు లీడర్లే డబ్బులిచ్చి టెండర్ వేయించినట్లు జనాలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
230 వైన్స్లకు నోటిఫికేషన్
ఉమ్మడి జిల్లాలో గతంలో 164వైన్స్ షాపులుండగా ఆ సంఖ్యను 230కి పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ సారి రిజర్వేషన్ల కల్పించడంతో మహబూబ్ నగర్ జిల్లాలో గౌడ్స్కు 14, ఎస్సీలకు 10, ఎస్టీలకు 3, నాగర్ కర్నూల్ జిల్లాలో గౌడ్స్ కు 9, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4 , వనపర్తి జిల్లాలో గౌడ్స్ కు 4, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1, గద్వాల జిల్లాలో గౌడ్స్కు 5, ఎస్సీలకు 6 షాపులు కేటాయించారు. అయితే లైసెన్స్, దరఖాస్తు ఫీజు మాత్రం తగ్గించలేదు. జనరల్ కేటగిరి మాదిరిగానే రూ.2 లక్షలు డీడీ కట్టించుకున్నారు. 9 నుంచి 18 వరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసులో దరఖాస్తులు స్వీకరించారు.
పేరుకే రిజర్వేషన్లు
230 షాపుల్లో మెజారిటీ షాపులను దక్కించుకునేందుకు లీడర్లు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని లీడర్లు షాపులన్నిటినీ హ్యాండోవర్ చేసుకునేలా పావులు కదిపినట్లు సమాచారం. దాదాపు టెండర్లన్నీ తమ అనుచరులు, బినామీలతో వేయించారు. కొందరు కొత్తవాళ్లు ఉన్నా వారితో ముందుగానే డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన 30 శాతం షాపుల్లోనూ వీరే వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. స్వయంగా డబ్బులిచ్చి అనుచరులు, బినామీలతో దరఖాస్తు చేయించినట్లు చర్చ జరుగుతోంది. డ్రాలో షాప్ వస్తే కొంత గుడ్విల్ చెల్లించేలా ఇప్పటికే ఒప్పందు చేసుకున్నట్లు సమాచారం.