- సర్కారుపై గొర్రెలు, మేకల పెంపకం దార్ల సంఘం నేతలు ఫైర్
- తెలంగాణ గడీ పేరుతో ప్రగతిభవన్ ముట్టడి
హైదరాబాద్, వెలుగు: గొర్రెలు వస్తాయని ఆశతో 28 వేల మంది పుస్తెలు తాకట్టుపెట్టి, అప్పులు చేసి డీడీలు తీశారని.. కానీ రెండేళ్లయినా ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయలేదని గొల్లకురుమలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తమను కోటీశ్వరులు చేస్తానని చెప్పి అప్పుల పాలు చేశారని విమర్శించారు. గొర్రెల పంపిణీని వెంటనే స్టార్ట్ చేయాలంటూ గొర్రెలు, మేకల పెంపకందారులు సోమవారం ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు.
రెండేళ్లయినా గొర్రెలియ్యరా?
వాళ్లను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ.. గొర్రెలు అడిగిన పాపానికి జైళ్లు, పోలీస్ స్టేషన్లకు పంపిస్తున్నారని విమర్శించారు. రెండేళ్లలో గొల్ల కురుమలందరికీ గొర్రెలిస్తామని 7,29, 067 మందిని ఎంపిక చేశారని, వీళ్లలో సగం మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
మేత లేదు.. మెడికల్ కిట్లు లేవు
నిరుడు గొల్ల కురుమల చలో అసెంబ్లీ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2020 సెప్టెంబర్ 25 నుంచి గొర్రెల పంపిణీ స్టార్ట్ చేస్తామని సర్క్యులర్ ఇచ్చారని, అసెంబ్లీలో ప్రకటన చేశారని రవీందర్ గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు మొదలవలేదన్నారు. ప్రమాదంలో చనిపోయే గొర్రెల కాపరులకు రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని అమలు చేయలేదన్నారు.
రెండో విడత వెంటనే స్టార్ట్ చేయాలె
ప్రభుత్వం స్పందించి రెండో విడత పంపిణీ స్టార్ట్ చేయాలని, డీడీలు తీసిన వారికి వెంటనే గొర్రెలివ్వాలని, అక్రమాలకు తావులేకుండా నగదు బదిలీ చేపట్టాలని రవీందర్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను గొర్రెలతో దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ప్రగతిభవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు ఆదివారం రాత్రి నుంచి 4,227 మందిని అరెస్టు చేశారు.