అన్నారం బ్యారేజీకి బుంగ.. 41వ పిల్లర్ అడుగు నుంచి వాటర్​లీకవుతున్నట్లు గుర్తింపు

అన్నారం బ్యారేజీకి బుంగ.. 41వ పిల్లర్ అడుగు నుంచి వాటర్​లీకవుతున్నట్లు గుర్తింపు
  • గప్ చుప్ గా ఇసుక బస్తాలు వేస్తున్న ఇరిగేషన్​అధికారులు

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద నిర్మించిన బ్యారేజీ వద్ద బుంగ పడింది. 4వ బ్లాక్ లోని 41వ పిల్లర్ అడుగు నుంచి వాటర్​లీకవుతున్నట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు గుర్తించారు. దీంతో  గప్ చుప్ గా రెండు రోజుల నుంచి ఇసుక బస్తాలు వేస్తున్నారు.  ప్రవాహ వేగానికి పిల్లర్ బేస్ నుంచి ఇసుక కొట్టుకుపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అక్టోబర్ 22న  మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ రెండు ఫీట్ల మేర కుంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ బ్యారేజీ 7వ బ్లాక్​లోని 20వ నంబర్‌‌‌‌ పిల్లర్‌‌‌‌ రెండు ఫీట్లు  కుంగింది. దీంతో దానికి ఇరువైపులా ఉన్న 19, 21వ పిల్లర్లపైనా ఎఫెక్ట్ పడింది. డిజైన్‌‌లో, నిర్మాణంలో లోపాలు ఉంటే మొత్తం మేడిగడ్డ బ్యారేజీయే కొట్టుకుపోయేదని ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ అన్నారు. ఇసుకపై కట్టడంతోనే కొన్ని సమస్యలు వచ్చాయి తప్ప.. నిర్మాణ లోపాలు లేవని తెలిపారు.