ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు కెప్టెన్ గా సేవలందించిన లెజండరీ ప్లేయర్ చున్నీ గోస్వామి (82) కన్నుమూశారు. కొన్నేళ్లుగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
ఫుట్ బాల్, క్రికెట్.. రెండింటిలోనూ ప్రతిభ
ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ లో లెజండరీ ప్లేయర్ చున్నీ గోస్వామి. 1956- 64 మధ్య దాదాపు 50 ఫుట్ బాల్ మ్యాచులు ఆడారు. 1962లో ఆయన కెప్టెన్సీలోనే భారత్ ఆసియా గేమ్స్ లో కప్ సాధించింది. ఆ తర్వాత ఆయన బెంగాల్ క్రికెట్ బోర్డ్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్లేయర్ గా మారడం విశేషం. ఇందులోనూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. 1971-72 రంజీ ట్రోఫీలో బెంగాల్ టీమ్ కు కెప్టెన్ గా ఫైనల్ చేర్చారాయన. గోస్వామి మృతి పట్ల ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సంతాపం ప్రకటించాయి.

