- 3 బిల్లులు ఆమోదం, 40 పద్దులపై చర్చ
- సహకరించినందుకు థ్యాంక్స్: మంత్రి వేముల
హైదరాబాద్, వెలుగు: శాసనసభ సమావేశాలు 10 రోజులు, మండలి సమావేశాలు 5 రోజులు జరిగాయని ఆర్ అండ్ బీ, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అసెంబ్లీ 58 గంటల 6 నిమిషాలు, కౌన్సిల్ 17 గంటల 37 నిమిషాలు నడిచిందన్నారు. ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్లో చీఫ్ విప్లు, విప్లతో కలసి మీడియాతో ఆయన మాట్లాడారు. సమావేశాల్లో మూడు బిల్లులు ఆమోదించుకున్నామని, 40 పద్దులపై చర్చ జరిగిందని చెప్పారు. యురేనియం తవ్వకాలపై రెండు సభల్లో తీర్మానం ఆమోదించుకున్నామన్నారు. సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, చీఫ్ విప్లు, విప్లు, ఫ్లోర్ లీడర్లకు ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీలో 54 మంది
అసెంబ్లీలో 54 మంది సభ్యులు మాట్లాడారని, మూడు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించామని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రులు కలిపి 27 గంటల 5 నిమిషాలు మాట్లాడారన్నారు. టీఆర్ఎస్ సభ్యులు 19 గంటల 12 నిమిషాలు, కాంగ్రెస్ సభ్యులు 6 గంటల 55 నిమిషాలు, ఎంఐఎం సభ్యులు 4 గంటల 8 నిమిషాలు మాట్లాడారని చెప్పారు. టీడీపీ సభ్యులు 11 నిమిషాలు ప్రసంగించగా బీజేపీ నుంచి మాట్లాడలేదన్నారు. కేసీఆర్ 6 గంటలు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క 3 గంటలు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ గంట మాట్లాడారని చెప్పారు.
కౌన్సిల్లో 56 మంది
కౌన్సిల్లో 56 మంది సభ్యులు ప్రసంగించారని, 3 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించినట్లు మంత్రి వేముల తెలిపారు. మంత్రులు 7 గంటలు, టీఆర్ఎస్ సభ్యులు 5 గంటల 9 నిమిషాలు, ఎంఐఎం మెంబర్స్ గంట 17 నిమిషాలు, కాంగ్రెస్ సభ్యుడు గంట 51 నిమిషాలు, బీజేపీ సభ్యుడు 51 నిమిషాలు మాట్లాడారన్నారు. ఇండిపెండెంట్ సభ్యుడు 35 నిమిషాలు, నామినేటెడ్ సభ్యుడు 28 నిమిషాలు మాట్లాడారని చెప్పారు.