హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. గురువారం (నవంబర్ 20) కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి హైదరాబాద్ వచ్చారు. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ అంశంపై ప్రహ్లాద్ జోషికి వివరించారు సీఎం రేవంత్. ప్రజలు తినే బియ్యం సరఫరా చేసినప్పుడే ఆ సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నట్టుగా దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ విషయంలో అవసరమైతే సమగ్రంగా అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
సీఎం రేవంత్ సూచనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. పూర్తి స్థాయి అధ్యయనం జరిపిన తరువాత దేశ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
