కోల్కతా: స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇండియా గోట్ టూర్లో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళం కారణంగా గోట్ ఇండియా టూర్ నిర్వాహకుడు సతద్రు దత్తాను కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. కోల్కతా లా అండ్ ఆర్డర్ ఏడీజీ జావేద్ షమీమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. మెస్సీ పాల్గొన్న కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలం కావడంతో ఈవెంట్ నిర్వాహకుడు సతద్రు దత్తాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రేక్షకులకు డబ్బు రిఫండ్ చేస్తారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
కాగా, గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి మెస్సీ వచ్చారు. ఈ గ్రౌండ్లో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో తమ అభిమాన ప్లేయర్ ఆటను కళ్లారా చూసేందుకు వేలకు వేలు పెట్టి టికెట్ కొని స్టేడియానికి తరలివచ్చారు ప్రేక్షకులు. కానీ మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. అంతేకాకుండా స్టేడియంలో మెస్సీ పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేదు. దీంతో మెస్సీ మ్యాచ్ ఆడతాడని ఆశించి వేలకు వేలు పెట్టి టికెట్లు కొన్న అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది.
12 వేలు పెట్టి టికెట్ కొంటే ఇలా ఉసూరుమనిపించడం దారుణమని గోట్ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. కుర్చీలు విరగ్గొట్టారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరేసి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు ఫ్యాన్స్ బారికేడ్లు దాటుకొని లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగ ప్రవేశ చేసి అభిమానులను చెదరగొట్టారు. ఫ్యాన్స్ గొడవ చేయడంతో మెస్సీ టీమ్ సొరంగం ద్వారా బయటకు వెళ్లిపోయారు. మెస్సీ మ్యాచ్ ఆడతారని ఊరించి చివరకు ఉసూరుమనిపించడంతో ఐదు నిమిషాల్లో మెస్సీ అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియం లోపల రచ్చ రచ్చ చేశారు.
మెస్సీ, ఆయన ఫ్యాన్స్కు సారీ: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ:
మెస్సీ టూర్ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియం జరిగిన గందరగోళంపై సీఎం మమతా బెనర్జీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పాల్గొన్న కార్యక్రమంలో జరిగిన నిర్వాహణ లోపం తనను తీవ్రంగా కలచివేసిందని.. దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఈ దురదృష్టకర సంఘటనకు లియోనెల్ మెస్సీ, అతని అభిమానులకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి దిద్దుబాటు చర్యలు సిఫార్స్ చేయడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

