లోకల్​ వర్సెస్​ నాన్ లోకల్

లోకల్​ వర్సెస్​ నాన్ లోకల్
  •    పార్లమెంట్​ సెగ్మెంట్లలో  బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్​ మధ్య వార్​​
  •     లోకల్​, నాన్​ లోకల్​ అంటూపలు నియోజకవర్గాలలో పోస్టర్లు

హైదరాబాద్​, వెలుగు :  పార్లమెంట్​ ఎన్నికల్లో లోకల్​ వర్సెస్​ నాన్​లోకల్​లొల్లి మొదలైంది. పలు లోక్​సభ సెగ్మెంట్లలో బీజేపీ, బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అభ్యర్థుల మధ్య వార్​ నడుస్తున్నది. ఈ లొల్లి ఏకంగా పోస్టర్ల వరకూ వెళ్లింది.  మల్కాజ్​గిరి సెగ్మెంట్​లో లోకల్​, నాన్​లోకల్​ పేరుతో పోస్టర్లు హల్ చల్​ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థులు నాన్​ లోకల్​ అని, బీఆర్ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్​ అని పేర్కొంటూ నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి.

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ది హుజూరాబాద్​ అని, అది మల్కాజ్​గిరి నుంచి 166 కిలోమీటర్ల దూరమని పోస్టర్లలో పేర్కొన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థి సునీతా రెడ్డిది చేవెళ్ల అని, మల్కాజ్​గిరి నుంచి 59  కిలోమీటర్ల దూరమని అందులో మెన్షన్​ చేశారు. కానీ, రాగిడి లక్ష్మారెడ్డి పక్కా లోకల్​అని స్థానిక సెంటిమెంట్​ను పోస్టర్ల రూపంలో వెల్లడించారు.  

మహబూబ్​నగర్​లో బీజేపీ వర్సెస్​ కాంగ్రెస్​

మహబూబ్ నగర్ కాంగ్రెస్​ పార్టీ ఎంపీ అభ్యర్థి నాన్​లోకల్​అని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ వ్యాఖ్యానించారు. తాను లోకల్​ అని, ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని ఆమె రెండు రోజుల క్రితం ఓ మీటింగ్​లో చెప్పుకొచ్చారు. అయితే, ఆమె కామెంట్లకు వంశీచంద్​ రెడ్డి దీటుగా రిప్లై ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీది గుజరాత్​ అయితే.. యూపీలోని వారణాసి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని అరుణను వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. 

లోకల్​ సెంటిమెంట్​తో ఓట్లు రాలుతాయా?

లోకల్​, నాన్​ లోకల్​ సెంటిమెంట్లను రెచ్చగొడితే ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పార్టీని, పోటీ చేసే అభ్యర్థిని బట్టే ప్రజలు ఓటేస్తారని అంటున్నారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో కొడంగల్​ నియోజకవర్గానికి చెందిన సీఎం రేవంత్​ రెడ్డి.. మల్కాజ్​గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బంపర్​ మెజార్టీతో గెలిచారు.

మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ కూడా 1980లో మెదక్​ నుంచి పోటీ చేసి గెలిచారు. అభ్యర్థి మంచివాడై..  ప్రజలకు సేవచేసే గుణం ఉంటే ప్రజలు లోకల్​, నాన్​  లోకల్​ అనే విషయం పట్టించుకోరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లోకల్​ సెంటిమెంట్​ను రెచ్చగొట్టినంత మాత్రాన ఆయా పార్టీలకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని అంటున్నారు.