పెండ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకుంది ఓ ప్రేమజంట.ఆంధ్ర ప్రదేశ్.. చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లికి చెందిన ధనంజయ, శ్రీకాళహస్తికి చెందిన పల్లవిలు గత సంవత్సరంగా ప్రేమించుకుంటున్నారు. ధనంజయ స్థానికంగా జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే మూడు రోజుల క్రితం వీరు తమ ప్రేమను తల్లిదండ్రులకు తెలియజేసి వివాహం చేయమన్నారు. ఇందుకు పెద్దలు అంగీకరించలేదు.
దీంతో చనిపోవడమే మార్గం అని నిర్ణయించుకున్న వీళ్లు.. మంగళవారం తెల్లవారుజామున మొరవపల్లి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు అందులో వాళ్ల కుటుంబసభ్యలను ఉద్ధేశించి మాట్లాడారు. తమకు పెళ్లి చేయనందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపారు. మాలాంటి వాళ్లను విడదీయొద్దని అందరినీ కోరారు. తాము విడిగా ఉండి బతకలేమని… అందుకే చనిపోతున్నామని వీడియోలో చెప్పారు. ఆత్మహత్యకు ముందు పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు.