Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు..!

Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు..!

ఈనెల 22 వ తారీఖు నాటికీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్ప పీడనం తొలుత వాయువ్య దిశలో కదిలి ఈనెల 24 వ తారీఖు నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రం లో కింద స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుండి వేస్తున్నాయని చెప్పారు. 

నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి చురుగ్గా ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న ( మే 20) దక్షిణ అంతర్గత తమిళనాడు, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు( మే 21)  దక్షిణ కోస్తా తమిళనాడు, పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తుకు విస్తరించి ఎత్తుకు వెల్లే కొలదీ నైరుతి దిశగా వంగి ఉంది.ఒక ద్రోణి దక్షిణ కోస్తా తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో నడుస్తుంది. 

మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. మే 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంలా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.