
- తప్పు చేయకుంటే భయం ఎందుకు?
- కమిషన్ చైర్మన్ను మాత్రమే మార్చమన్నది
- తీర్పుతో కేసీఆర్ భుజాలు తడుముకుంటున్నడు
- జడ్జిమెంట్ ను సరిగా చదివిఅర్థం చేసుకోవాలి
- గత పాలకులు తిన్నది కక్కించే బాధ్యత సీఎంపై ఉందని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: విద్యుత్తు కొనుగోళ్లపై వేసిన జుడీషియల్ కమిషన్ ఎంక్వైరీ కొనసాగించవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్ భుజాలు తడుముకుంటున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ విమర్శించారు.
మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టెక్నికల్ పాయింట్లపైనే కమిషన్ చైర్మన్గా ఉన్న జడ్జిని మార్చి కొత్త జడ్జితో విచారణ చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఇది తెలుసుకోకుండా పింకీ తమ్ముళ్లు సంబరపడుతున్నారని, జడ్జిమెంట్ ను సరిగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ అవినీతి చేయలేదని సుప్రీం కోర్టు చెప్పలేదని, కొత్త జడ్జి వచ్చి అవినీతిని బయటకు తీస్తారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అవినీతికి పాల్పడలేదని ఎక్కడా తీర్పులో పేర్కొనలేదన్నారు.
తప్పు చేయనప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కలవరం ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరుకావచ్చు కదా ప్రశ్నించారు. గత పదేండ్లలో విద్యుత్ కొనుగోళ్ల పేరిట రూ. 80 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్టు గతంలోనే చెప్పానన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని జగదీశ్వర్ రెడ్డి, హరీశ్రావు సవాలు విసిరింది నిజం కాదా.. అని ప్రశ్నించారు.
ఇప్పుడు విచారణ చేపడుతుంటే కోర్టులను ఆశ్రయించి అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బిడ్డల నుంచి మీరు దోచుకున్నదంతా కక్కించాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ మీద ఉందన్నారు. చట్టబద్ధంగానే విచారణ చేపట్టి కేసీఆర్ ను జైల్లో పెడతామన్నారు. గ్రీన్ చాలెంజ్ అని హడావిడి చేసే చెట్ల సంతోష్ పత్తా లేకుండా పోయిండని, ఆయన భార్య పేరుమీద నర్సరీ పెట్టి కోట్ల రూపాలను దోచుకున్నారని, దానిపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాకముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎంత.. అధికారంలోకి వచ్చాక ఆస్తులు ఎంత..అని నిలదీశారు. మీవి.. మీకు సహకరించిన అధికారుల ఆస్తులు ఎంతనో లెక్కతీస్తామని హెచ్చరించారు.