భోపాల్: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రజనీశ్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేశ్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వారికి ఎన్నికల సంఘం గురువారం ధ్రువీకరణ పత్రాలు అందజేసింది. ఈ మూడింటిలో ఒక స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే జూన్ 9న ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో పోటీ జరిగే అవకాశం లేకుండా పోయింది.
మీనాక్షీ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ
ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని, ఏకపక్షమని ఆరోపిస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పది మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ను కలిసింది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టులోనూ కాంగ్రెస్ పిటిషన్ వేసింది. అత్యవసర విచారణ జరపాలని విన్నవించారు.
ఫలితాలను ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, పిటిషన్ కాపీ తమకు అందలేదని, స్పందించేందుకు సమయం కావాలని ఈసీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కోర్టు నుంచి తక్షణ ఆదేశాలు రాకపోవడంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి, ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించింది.
