ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) తిరుగుబాటు లీడర్ అజిత్ పవార్కు సీఎం ఏక్ నాథ్ షిండే కేబినెట్లో కీలకమైన ఆర్థిక శాఖ ఇచ్చారు. ప్రణాళిక శాఖ బాధ్యతలు కూడా ఆయనే చూస్తారు. షిండే తన కేబినెట్ను శుక్రవారం విస్తరించారు. ఎన్సీపీలో తిరుగుబాటు చేసి శివసేన బీజేపీ ప్రభుత్వంలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు షిండే కేబినెట్లో చోటు దక్కింది.
చగన్ భుజ్ బల్కు ఆహార, పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల హక్కుల రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధరం రావ్ బాబా ఆత్రంకు డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ), దిలీప్ వాల్సే పాటిల్ కు సహకార శాఖ, ధనంజయ్ ముండేకు వ్యవసాయ శాఖ ఇచ్చారు. ఇక హసన్ ముష్రిఫ్కు వైద్యవిద్య శాఖ, అనిల్ పాటిల్ కు రిలీఫ్ అండ్ రిహబిలిటేషన్, విపత్తు నిర్వహణ, అదితి తత్కారేకు మహిళ, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు.
క్రీడలు, యువజన సంక్షేమ, ఓడరేవుల శాఖను సంజయ్ బన్సోడే చేపట్టనున్నారు. కాగా, గత నెలలో అజిత్ పవార్ నేతృత్వంలోని 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆ తొమ్మిది మందికి తాజాగా షిండే కేబినెట్లో చోటు దక్కింది.