అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి .. ఎమ్మెల్సీ కవిత వినతి

అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి .. ఎమ్మెల్సీ కవిత వినతి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​ను  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఆదివారం హైదర్ గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్పీకర్ ను భారత జాగృతి తరపున కవిత కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీల కోసం అనేక ఉద్యమాలు చేసిన సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే అని ప్రశంసించారు. తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి అసెంబ్లీ ప్రాంగణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నామని తెలిపారు. 

ఇప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పూలే విగ్రహం కోసం  ఉద్యమిస్తామన్నారు. ఏప్రిల్ 11న ఫూలే జయంతి లోపు స్పీకర్, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫూలే విగ్రహ ఏర్పాటు కోసం బీసీ సంఘాలతో కలిసి భారత జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ఫూలే విగ్రహం ఏర్పాటు కోసం ఈ నెల 26న హైదరాబాద్ లో రౌండ్​టేబుల్ ​సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.