
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాంటి వాళ్లలో సోనాలి బింద్రే, మనీషా కోయిరాల, హంసా నందిని లాంటి పలువురు స్టార్ హీరోయిన్స్ ఉండగా.. ఆ జాబితాలోకి మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ఆమే మహిమా చౌదరి. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా మహిమను అనుపమ్ ఖేర్ ఒక హీరోగా అభివర్ణించారు. ‘‘అభిమానులకు ఈ విషయాన్ని నేనే చెప్పాలని ఆమె ఆశించారు’’ అని అనుపమ్ ఖేర్ తెలిపారు. మహిమా చౌదరి ధైర్యం, కేన్సర్ కు సంబంధించిన కథనం అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ‘‘నా 525వ చిత్రం ‘ద సిగ్నేచర్’లో కీలక పాత్ర పోషించే విషయమై నేను నెల క్రితం అమెరికా నుంచి మహిమా చౌదరికి కాల్ చేశాను. ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ ఉందని ఆ సంభాషణతో తెలిసింది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంలో నేను కూడా భాగం కావాలని ఆమె కోరుకుంది’’ అని అనుపమ్ ఖేర్ ఓ పోస్ట్ పెట్టారు. స్నేహితులారా ఆమెకు మీ ప్రేమ, దీవెనలు, ప్రార్థనలు అందించండని కోరారు.
దీనిపై మహిమ చౌదరి కూడా స్పందించింది. ‘‘తన సినిమాలో నటించాలని అనుపమ్ నాకు కాల్ చేశారు. ఆ సమయలో నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. వెబ్ షోలు, సినిమాల్లో నటించాలంటూ నాకు ఎన్నోకాల్స్ వస్తున్నాయి. కానీ నేను యస్ అని చెప్పలేను. ఎందుకంటే నాకు జుట్టు లేదు’’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తనకు క్యాన్సర్ లక్షణాలు ఏవీ లేవని, సాధారణ చెకపుల్లో అది బయటపడినట్టు ఆమె తెలిపారు.