హైదరాబాద్: ఉబర్ లో 50 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్నట్లు తెలిపింది మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్. ఉబర్ సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటి మెయిన్ సిటీస్ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే విషయంలో డీల్ కుదుర్చుకున్నట్లు ఎంఅండ్ఎం అనౌన్స్ చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటగా హైదరాబాద్ లో మహీంద్ర ఈ2ఓ ప్లస్ హ్యాచ్ బ్యాక్, మహీంద్ర వెరిటో సెడాన్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వీటి అవసరాల కోసం సిటీలో క్యాబ్ సేవలు అందిస్తున్న పబ్లిక్, ప్రైవేటు సంస్థలతో కలిసి పలు ప్రాంతాల్లో 30 కామన్ ఛార్జింగ్ స్టేషన్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది సంస్థ.
ఈ సందర్భంగా మాట్లాడారు మహీంద్ర ఎలక్ట్రిక్ సీఈవో మహేశ్.. ‘భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ను పెంచే దిశగా కృషి చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఉబర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఉబర్ ద్వారా మరిన్ని మహీంద్ర ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని తెలిపారు.