- పోలీస్ స్టేషన్ బాత్రూంలో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం
- నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి
చేవెళ్ల/తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో ఇద్దరు మహిళల హత్య కేసులో ప్రధాన నిందితురాలైన కరీమా బేగం (42) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. తనకు అప్పులు ఇచ్చి తిరిగి అడిగినందుకే బషీరాబాద్ మండలం కాశీంపూర్కు చెందిన అబేదాబేగం (60), తాండూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబా బేగం (65)ను దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాలను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్టలోని ఓ ఫాంహౌస్ వద్ద పాతిపెట్టిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన తాండూరు పోలీసులు.. గత నెల 17న కరీమాబేగంతో పాటు ఆమె భర్త రెహమన్, తోల్కట్టకు చెందిన నయీమ్ను అరెస్ట్ చేశారు. నిందితులను తోల్కట్టకు తీసుకొచ్చి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం నిందితులను కరణ్కోట్ పోలీస్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ప్రధాన నిందితురాలు కరీమాబేగం అర్ధరాత్రి బాత్రూంలోకి వెళ్లి యాసిడ్ తాగింది.
పోలీసులు వెంటనే ఆమెను హైదరాబాద్లోని నిమ్స్ కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ మెజిస్ర్టేట్ ముందు హాజరుపర్చి నిందితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. అనంతరం తిరిగి నిమ్స్లోనే చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం
నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
