గాంధీ, ఉస్మానియాలో మేజర్‌ ఆపరేషన్లు బంద్​

గాంధీ, ఉస్మానియాలో మేజర్‌ ఆపరేషన్లు బంద్​

హైదరాబాద్, వెలుగు: పేదోళ్లకు పెద్ద రోగమొస్తే గాంధీ, ఉస్మానియా దవాఖాన్లే దిక్కు. కానీ ఇప్పుడు ఆ పెద్దాస్పత్రుల్లోనూ పేదలకు సరైన ట్రీట్ మెంట్ అందడం లేదు. పెద్ద పెద్ద ఆపరేషన్లు అవసరమయ్యే పేషెంట్లను వెనక్కి పంపేస్తున్నారు. జులైలో కురిసిన భారీ వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రిలో వరద, డ్రైనేజీ నీరు చేరడంతో పాత బిల్డింగ్‌‌‌‌ను పూర్తిగా మూసేశారు. దీంతో విశాలమైన ఉస్మానియా కాస్త ఇరుకుగా మారిపోయింది. కొత్త బిల్డింగ్‌‌‌‌లో సందు లేకుండా బెడ్లు ఏర్పాటు చేశారు. కానీ ఆపరేషన్ థియేటర్లను మాత్రం ఏర్పాటు చేయలేదు. కొత్త థియేటర్లు ఏర్పాటు చేయకుండా, ఇప్పటికే ఉన్న వాటినే అడ్జస్ట్‌‌‌‌ చేశారు. థియేటర్లను ఏర్పాటు చేయాలని జూనియర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు ధర్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కొత్త బిల్డింగ్‌‌‌‌లోని ప్లాస్టిక్ సర్జరీ థియేటర్‌‌‌‌నే ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ డిపార్ల్‌‌‌‌మెంట్లు వాడుకుంటున్నాయి. అలాగే న్యూరో సర్జరీ థియేటర్‌‌‌‌‌‌‌‌నే న్యూరో, ఆర్థో సర్జరీ డిపార్ట్‌‌‌‌మెంట్లు వినియోగించుకుంటున్నాయి. దీంతో ఉస్మానియాలో ఆపరేషన్లు ఆలస్యమవుతున్నాయి. గాల్‌‌‌‌బ్లాడర్ స్టోన్స్‌‌‌‌, ల్యాప్రోస్కోపితో చేయాల్సిన ఆపరేషన్లను మొత్తానికే చేయడం లేదు. ఇక గాంధీ ఆస్పత్రిలోనూ కరోనాను బూచిగా చూపి ఈ సర్జరీలు చేస్తలేరు. ఇటీవలే గాంధీలో నాన్‌‌‌‌ కొవిడ్‌‌‌‌ సేవలు ప్రారంభించారు. కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో సర్జికల్ డిపార్ట్‌‌‌‌మెంట్లు పని చేయడం లేదు. కనీసం మరో రెండు వారాల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ లో చేస్తలేరు…

చాలా ఆపరేషన్లు గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో తప్ప మరెక్కడా అందుబాటులో లేవు. ఈ రెండు చోట్లా ఆపరేషన్లు చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజుల భయంతో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లడానికి మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. ఇక పేదోళ్లు అక్కడికి వెళ్లే పరిస్థితి అసలే లేదు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు ఆయా సర్జరీలు చేయడానికి సాల్తలేవని ప్రైవేట్ హాస్పిటళ్లు ఒప్పుకోవడం లేదు. అదనంగా రూ.లక్షల్లో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో తమకు చావు తప్ప మరో మార్గం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాలాంటోళ్లు ఏడికిపోవాలె?

నడుం నొప్పితో కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్ లో చూపించుకున్న. స్కానింగ్ తీసి హిప్‌‌‌‌ రీప్లేస్‌‌‌‌మెంట్ చేయాలన్నరు. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నరు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ సివిల్ హాస్పిటల్‌‌‌‌లో అడిగితే గాంధీకి వెళ్లాలన్నరు. తెలిసినవాళ్ల ద్వారా గాంధీలో ఎంక్వైరీ చేస్తే కరోనా కారణంగా ఆ సర్జరీ చేయడం లేదన్నరు. ఇంకో నెల రోజులు పడుతుందని చెప్పిన్రు. ఉస్మానియా దవాఖానలోనూ ఇప్పుడు చేయమంటున్రు. మాలాంటోళ్లు ఏడికిపోవాలె మరి?

– శ్రీనివాస్‌‌‌‌, పెద్దపల్లి