మల్కాజిగిరి,వెలుగు: షాలీమార్ కంపెనీ పేరుతో నకిలీ మైదా పిండి తయారు చేసి అమ్ముతున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ వోటీ ఇన్ స్పెక్టర్ నవీన్ కుమార్ కథనం ప్రకారం..మౌలాలిలోని రాఘవేంద్ర నగర్ లో ఉండే వనపర్తి రమేశ్(36) శ్రీ వెంకటేశ్వర ప్రొవిజన్స్ స్టోర్ ను నడుపుతున్నాడు. అందులో భాష్యం రాజ్ కుమార్(42) సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. రాజ్ కుమార్ఐదేళ్లుగా పటాన్చెరువు వద్ద ఉన్న షాలీమార్ రోలర్ ఫ్లోర్ మిల్ కంపెనీ నుంచి మైదా పిండి తెచ్చేవాడు. కొన్ని నెలలుగా రమేష్ షాలీమార్ కంపెనీ నుంచి ఖాళీ బ్యాగులను తీసుకువచ్చి గౌలిగూడకి చెందిన బ్రిజ్జి గోపాల్(59) సాయంతో తక్కువ రేటుకి దొరికే మైదా పిండిని అందులో నింపుతున్నాడు.
నాణ్యత లేని తక్కువ రేటున్న మైదాపిండి షాలీమార్ కంపెనీ బ్యాగుల్లో నింపి రమేశ్వాటిని అమ్మేవాడు. షాలీమార్ కంపెనీ పేరుతో
నకలీ మైదా పిండిని తయారు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్ వోటీ పోలీసులు సోమవారం రమేశ్ప్రొవిజనల్ స్టోర్ పై దాడి చేశారు. 13 షాలీమార్ పేరుతో తయారు చేసిన నకిలీ మైదా పిండి బ్యాగ్ లు, 37 ఖాళీ సంచులు, ఓ మెషీన్ ను, సెల్ ఫోన్ సీజ్ చేశారు. నిందితులు రమేష్, రాజ్కుమార్ను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్కి తరలించామని ఎస్ఓటి ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.