ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన

ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన
  • మైనింగ్​ శాఖ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కాపై బదిలీ వేటు  
  • ఆయన స్థానంలో సురేంద్ర మోహన్ నియామకం 
  • లోక్ సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత మరిన్ని బదిలీలు
  • స్పెషల్ సీఎస్​లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లను మార్చే చాన్స్  

హైదరాబాద్, వెలుగు : పనితీరు సరిగాలేని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి పక్కనపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను అర్థం చేసుకుని ప్రజలకు మేలు జరిగే విధంగా పని చేయకపోతే వేటు తప్పదని అధికారులకు ఆయన సంకేతాలు పంపారు. ఇప్పటికే కీలకమైన కొన్ని పోస్టులను సమర్థులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అప్పగించిన రేవంత్.. వివిధ విభాగాల హెచ్​ఓడీల పనితీరును పరిశీలిస్తూ, ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే మార్చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో ఒక్కో శాఖ పనితీరుపై సీఎం రివ్యూ చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఎలాంటి ప్రగతి సాధించారు? ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తున్నారా? లేదా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. 

ఆయా విభాగాల అధికారుల పనితీరు సరిగ్గా లేకపోతే బదిలీ చేస్తున్నారు. తాజాగా గనుల శాఖ కార్యదర్శి, మినరల్ డెవలప్​మెంట్​కార్పొరేషన్ ఎండీ మహేశ్​దత్​ఎక్కాపై బదిలీ వేటు పడింది. గురువారం మైనింగ్ తో పాటు వివిధ శాఖలపై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మినరల్​డెవలప్​మెంట్​కార్పొరేషన్ నుంచి ఆశించిన రాబడి రాకపోవడం, ప్రజలకు ఇసుక కొరతపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం మహేశ్ దత్ ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో సురేంద్ర మోహన్​ను మైనింగ్ శాఖ సెక్రటరీగా నియమించారు. మినరల్​డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.   

త్వరలో మరిన్ని బదిలీలు.. 

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మరిన్ని బదిలీలు ఉంటాయనే చర్చ జరుగుతున్నది. కలెక్టర్లు మొదలు స్పెషల్ సీఎస్​ల వరకు మార్పులు ఉంటాయని చెబుతున్నారు. పోలీసు డిపార్ట్​మెంట్​లోనూ పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టే చాన్స్ ఉందంటున్నారు. సీఎస్​శాంతికుమారి ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి వివిధ శాఖల్లో ప్రిన్సిపల్​సెక్రటరీలుగా పని చేస్తున్న కొందరిని రేవంత్​సర్కార్ ఇంకా టచ్ చేయలేదు. నలుగురు స్పెషల్​సీఎస్​లను అలాగే కొనసాగిస్తున్నది. వారిని బదిలీ చేసే అవకాశం ఉన్నది. డిసెంబర్​7న పాలన మొదలుపెట్టిన సీఎం రేవంత్​రెడ్డి.. మొదట ఐఏఎస్​, ఐపీఎస్​ల బదిలీలు చేపట్టారు. సీనియర్ ఐఏఎస్​లు, ఐపీఎస్​లకు ఫోకల్​పోస్టింగ్​లు ఇచ్చారు. పనిలో పూర్తి స్వేచ్ఛ కల్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమర్థులైన చాలామంది అధికారులు సైడ్​పోస్టుల్లో పని చేశారు. అలాంటి వారికి రేవంత్ కీలకమైన హెచ్‌‌వోడీ పోస్టులు అప్పగించారు. కార్పొరేషన్లకూ ఐఏఎస్​లను నియమించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఈసీ ఆదేశాల మేరకు కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఎన్నికల షెడ్యూల్​ఉండటంతో ప్రభుత్వం పెద్దగా ఎవరినీ కదపలేదు. ఇక ఇప్పుడు పూర్తిస్థాయిలో పాలనపై దృష్టిపెట్టిన రేవంత్.. అధికారుల పనితీరు ఆధారంగా పోస్టింగ్ లు ఇవ్వనున్నారు. 

పోస్టింగ్​ల విషయంలో ఆచితూచి.. 

అధికారులకు పోస్టింగ్​ల విషయంలో సీఎం రేవంత్​ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పనితీరు సరిగా లేని అధికారులను నిర్మొహమాటంగా పక్కన పెడుతున్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కొంతమంది ఐఏఎస్​అధికారులను కేవలం అదనపు కార్యదర్శి, సహాయ కార్యదర్శి, అడిషనల్‌‌ డైరెక్టర్‌‌ వంటి పోస్టుల్లో నియమించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల అధికారులను పట్టించుకోలేదని.. వారిని ప్రాధాన్యం పోస్టుల్లోనే నియమించిందన్న చర్చ ఐఏఎస్‌‌ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులకే పెద్దపీట వేసిందని అప్పట్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఐఏఎస్​లు విమర్శలు చేశారు. మెరిట్‌‌ ఉన్నా తమను పక్కన పెట్టిందని అన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్.. వివిధ శాఖలకు సమర్థులైన అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.