మల్లారెడ్డి ఈజ్ బ్యాక్!.. సార్ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా

మల్లారెడ్డి ఈజ్ బ్యాక్!.. సార్ ఆదేశిస్తే ఎంపీగా పోటీ  చేస్తా

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇటీవల జరిగిన​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్నికల తర్వాత ఫ్యామిలీతో కలిసి గోవా టూర్ వెళ్లొచ్చిన ఆయన ఇవాళ సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో బీఆర్ఎస్  నేత టింకూ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పతంగుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. చిన్నారులకు పంతంగులు పంచటంతోపాటు వాళ్లతో కలిసి ఉత్సాహంగా గాలిపటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మాల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తానంటూ ఆసక్తికర ప్రకటన చేశారు. దీనికి నెటిజన్లు మల్లారెడ్డి ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాము గోవాలో చాలా ఎంజాయ్ చేసినట్టు వివరించారు. గోవా బీచ్‌లో బోటింగ్, పారాసైలింగ్‌‌తో పాటు స్వయంగా బోట్ నడుపుతూ ఉత్సాహంగా గడిపినట్టు చెప్పారు. తన వయసు ప్రస్తుతం 71 ఏళ్లని.. అయినా ఇంత స్మార్ట్‌గా, యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం.. హెల్త్ పట్ల తాను తీసుకునే జాగ్రత్తలేనని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించొచ్చని మల్లారెడ్డి వివరించారు.