వద్దన్నా వేశారు..అమ్మ ప్రాణం తీశారు

వద్దన్నా వేశారు..అమ్మ ప్రాణం తీశారు

కరోనా మూడో వేవ్ భయంతో వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. చెట్టు పుట్టా చుట్టి మరి వైద్య అధికారులు ప్రతీ ఒకరికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో వంద శాతం వ్యాక్సినేషన్ కోసం అధికారులు, రాజకీయ నాయకులు చూపిన అత్యుత్సాహం తన తల్లి ప్రాణం తీసిందని ఓవ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ  ఘటన భూపాలపల్లి జిల్లాలో జరిగింది. మహదేవపూర్ మండలం ఎడపెల్లికి చెందిన సరోజ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే ఆమె అనారోగ్యం ఏంటో తెలుసుకోకుండా... స్థానిక రాజకీయ నాయకుల సహకారంతో వైద్యసిబ్బంది... ఆమెకు బలవంతంగా వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఇచ్చే క్రమంలో సరోజ వద్దని వారించినా వారు వినలేదు. తనకు ఆరోగ్యం బాగా లేదని వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఆమె పదే పదే చెప్పారు. అయినా అవేమీ పట్టించుకోని వైద్య సిబ్బంది బలవంతంగా వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో ఆమె వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తీవ్రమైన జ్వరంతో మరణించిందని ఆమె కుమారుడు సృజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తల్లికి వ్యాక్సిన్ ఇస్తున్న వీడియో ఆధారంగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు బలవంతంగా వ్యాక్సిన్ వేయడంవల్లే తీవ్రమైన జ్వరంతో తన తల్లి మరణించిందని  సృజన్ ఆరోపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

డ్రై ఫ్రూట్స్​  మస్తు తింటున్నరు