- మంచిర్యాల జిల్లా కొత్తూరులో ఘటన
లక్సెట్టిపేట, వెలుగు : ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన ఓ వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కొత్తూరు గ్రామంలో జరిగింది. లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహేశ్ (41) పట్టణంలో బిర్యాని పాయింట్ నడిపిస్తున్నాడు. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన మహేశ్.. పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోవడమే కాకుండా.. మరో రూ. 10 లక్షలు సైతం అప్పు చేశాడు. ఓ వైపు డబ్బులు నష్టపోవడం, మరోవైపు అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి తేవడంతో మనస్తాపానికి గురైన మహేశ్ రాత్రి తన హోటల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
