నో పార్కింగ్‌లో బైక్.. ఫైనేసిన పోలీసును పొడిచిన బైకర్

నో పార్కింగ్‌లో బైక్.. ఫైనేసిన పోలీసును పొడిచిన బైకర్

భోపాల్‌: నో పార్కింగ్‌లో నిలిపిన బైక్‌కు ఫైనేసినందుకు పోలీసును బైకు యజమాని కత్తితో పొడిచాడు. ఈ ఘటన భోపాల్‌లో శనివారం జరిగింది. స్థానికంగా నివసించే హర్ష్ మీనా అనే వ్యక్తి శనివారం జ్యోతి టాకీస్‌కు వచ్చాడు. అక్కడ తన బైక్‌ను నో పార్కింగ్ జోన్‌లో పార్క్ చేశాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్ దూబే.. నో పార్కింగ్ జోన్‌లో పార్క్ చేసిన వాహనాలను పోలీస్ క్రేన్ సాయంతో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
  
టాకీస్ బయటకు వచ్చిన హర్ష్.. బైకును పోలీసులు తీసుకెళ్లారని తెలుసుకొని స్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే అప్పటికే ఫైన్ వేశానని ఏఎస్సై చెప్పడంతో.. హర్ష్ ఇంటికి వెళ్లి డబ్బులు తెచ్చి ఫైన్ కట్టాడు. కాగా.. పోలీస్ స్టేషన్ వద్ద క్రేన్ దగ్గర నిలబడి ఉన్న శ్రీరామ్ దూబే దగ్గరకు వెళ్లిన హర్ష్ కోపంతో కత్తితో అతని కడుపులో పొడిచాడు. అనంతరం పారిపోవడానికి ప్రయత్నించగా.. అక్కడున్న వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫైన్ కట్టిన తర్వాత నిందితుడు ట్రాఫిక్ పోలీసును ఎందుకు పొడిచాడు అనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.