- భార్యతో గొడవపడి బాల్కనీ నుంచి కొడుకును విసిరేసిండు
- ఆ తర్వాత తానూ దూకిన భర్త
- ఢిల్లీలో ఘటన.. తండ్రీకొడుకుల ఆరోగ్య పరిస్థితి సీరియస్
న్యూఢిల్లీ: భార్యతో గొడవ పడిన భర్త.. కోపంతో రెండేండ్ల కొడుకును మూడంతస్తుల బిల్డింగ్పై నుంచి విసిరేసి, తాను కూడా దూకేశాడు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని కల్కాజీ స్లమ్లో జరిగింది. కుటుంబ గొడవలతో మాన్సింగ్, అతడి భార్య పూజ కొద్ది నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. కల్కాజీ స్లమ్లోని తన అమ్మమ్మ ఇంట్లో ఇద్దరు పిల్లలతో పాటు పూజ ఉంటోంది. శుక్రవారం భార్య, పిల్లలను చూసేందుకు మాన్సింగ్ కల్కాజీ స్లమ్కు వచ్చాడు. ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. వారిద్దరూ తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు.
అసహనానికి గురైన మాన్సింగ్.. ఆ కోపంలో రెండేండ్ల కొడుకును మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందికి విసిరేశాడు. ఆ తర్వాత తాను కూడా అక్కడి నుంచి దూకేశాడు. 21 అడుగుల ఎత్తునుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులను ఎయిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు. కాగా, తాగిన మత్తులో మాన్సింగ్ ఈ ఘోరానికి పాల్పడ్డాడని పూజ అమ్మమ్మ ఆరోపించింది. మాన్సింగ్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.