సమ్మెతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. ఓబీ కాంట్రాక్టర్​తో కార్మికుల చర్చలు విఫలం

సమ్మెతో  నిలిచిన బొగ్గు ఉత్పత్తి..    ఓబీ కాంట్రాక్టర్​తో కార్మికుల  చర్చలు విఫలం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్​కాస్ట్ కాంట్రాక్ట్​కార్మికుల సమ్మె కారణంగా  శుక్రవారం రెండోరోజు కూడా బొగ్గు ఉత్పత్తి, ఓవర్​బర్డెన్​ పనులు నిలిచిపోయాయి.  రెండు రోజుల్లో   12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం జరిగింది.  సుమారు 1.20లక్షల క్యూబిక్​ మీటర్ల ఓవర్​బర్డెన్​ వెలికితీత నిలిచిపోయింది.   ఆర్​వీఆర్​ ఓబీ కాంట్రాక్ట్​ కంపెనీ గోదావరిఖనిలో బేసిక్​ వేతనంలో గుడ్​విల్​ కలిపి ఇస్తుందని, ఇక్కడ కూడా అదేవిధంగా ఇవ్వాలని కాంట్రాక్ట్​వోల్వో డ్రైవర్లు డిమాండ్​ చేశారు. 

కాంట్రాక్ట్​ కార్మికుల డిమాండ్లపై శుక్రవారం కల్యాణిఖని ఓపెన్​కాస్ట్ పీవో ఆఫీస్​లో చర్చలు జరిగాయి. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.మోహన్​రెడ్డి సమక్షంలో ఓబీ కాంట్రాక్ట్​ కంపెనీ ఆర్​వీఆర్​ప్రతినిధులు,   కార్మిక సంఘాల లీడర్లు, కాంట్రాక్ట్​ డ్రైవర్లు చర్చలు జరిపారు.  సమస్య పరిష్కారానికి మూడు రోజుల టైమ్​ ఇవ్వాలని,  అప్పటి వరకు వాహనాలు నడపాలని జీఎం కార్మికులకు సూచించారు. వీఆర్​ఎస్​ కంపెనీ ఇన్​చార్జి  రాజన్న  మాట్లాడితే వెహికల్స్​ నడుపుతామంటూ కార్మికులు  బయటకు వెళ్లిపోయారు.  దీంతో  రెండో రోజు సమ్మె కొనసాగింది.