మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ.. ఎన్ కౌంటర్‎లో AOB సెక్రెటరీ గాజర్ల రవి మృతి

మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ.. ఎన్ కౌంటర్‎లో AOB సెక్రెటరీ గాజర్ల రవి మృతి

హైదరాబాద్: మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే  నంబాల కేశవ్, చలపతి, సుధాకర్ వంటి టాప్ లీడర్లను కోల్పోయిన ఆ పార్టీ.. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్‎లో మరో కీలక నేతను కోల్పోయింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ సెక్రటరీ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఎన్ కౌంటర్‎లో చనిపోయాడు. బుధవారం (జూన్ 17) ఆంధ్రప్రదేశ్‎లోని అల్లూరి జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండమొదలు వద్ద ఎన్ కౌంటర్ జరిగింది. 

భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. మృతులను ఏవోబీ సెక్రటరీ గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణ, అంజుగా గుర్తించారు. అరుణను మావోయిస్ట్ పార్టీ అగ్రనేత చలపతి భార్యగా గుర్తించారు.  అరుణపై రూ.10 లక్షల రివార్డ్‌ ఉందని తెలిపారు. మావోయిస్టుల నుంచి మూడు ఏకే 47 రైఫిల్స్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఎన్ కౌంటర్లో మృతి చెందిన గాజర్ల రవి స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల.  మావోయిస్టు భావజాలానికి ఆకర్శితుడై 1992లో నక్సల్స్ ఉద్యమంలో చేరాడు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు. 2004లో అప్పటి పీపుల్స్ వార్ ప్రతినిధిగా ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నాడు. సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడి ఘటనలో గాజర్ల రవి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ గా, ఆంధ్ర-ఒడిషా బోర్డర్ (ఏవోబీ) కార్యదర్శిగా పని చేస్తున్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రవిని మోస్ట్ వాంటెడ్‎గా మావోయిస్టుగా ప్రకటించింది. రవి తలపై రూ.25 లక్షల రివార్డ్ ఉంది.