
హైదరాబాద్ లోని నాగోల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. మంగళవారం ( మే 6 ) నాగోల్ లోని సాయినగర్ కాలనీలో ఉన్న గుడిసెలలో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు భారీగా ఎగసి పడి.. పక్క ఇంటికి కూడా అంటుకున్నాయని తెలిపారు స్థానికులు. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో గుడిసెల దగ్గర దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. 13 ఏళ్ళ కిందట ఇదే ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు స్థానికులు.
►ALSO READ | గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు.. లేఔట్ లో రోడ్లు, పార్కుల్లో అక్రమణల తొలగింపు..
ఎండాకాలంలో గుడిసెల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని.. గ్యాస్ లీకేజి లేకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు. వంట వండే సమయంలో తగినంత వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని సూచించారు అధికారులు.