మ్యాన్​హోళ్లపై గ్రిల్స్ ఫిట్టింగ్ కంప్లీట్​ చేయాలి

మ్యాన్​హోళ్లపై గ్రిల్స్ ఫిట్టింగ్ కంప్లీట్​ చేయాలి
  • వాటర్​బోర్డు మాన్సూన్ ​ప్లాన్​పై ఎండీ సుదర్శన్​రెడ్డి సమీక్ష
  • చలివేంద్రాలను మరికొన్ని రోజులు కొనసాగించాలని నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: వానల టైంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాటర్​బోర్డు స్పెషల్​టీమ్స్ పనిచేయాలని ఎండీ సుదర్శన్​రెడ్డి ఆదేశించారు. డివిజన్ల వారీగా వాటర్ లాగింగ్, స్టాగ్నింగ్ పాయింట్లను గుర్తించి, వరద నీరు నిల్వకుండా చూడాలన్నారు. సోమవారం వాటర్​బోర్డు హెడ్డాఫీసులో మాన్సూన్​యాక్షన్​ప్లాన్​అమలుపై ఎండీ సుదర్శన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

రోడ్లపై సీవరేజీ ఓవర్ ఫ్లో కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, డీప్ మ్యాన్ హోళ్లకు గ్రిల్స్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఇంకా ఎక్కడైనా గ్రిల్స్ ఫిట్టింగ్​పనులు పెండింగ్​ఉంటే వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజావాణితోపాటు వాటర్​బోర్డుకు అందుతున్న ఫిర్యాదులపైన ఫోకస్​పెట్టాలని సూచించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్​టీమ్స్​పనితీరుపై ఆరా తీశారు. 

ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్​బోర్డు సిటీలోని వేర్వేరుచోట్ల  ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మరికొన్ని రోజులు  కొనసాగించాలని ఎండీ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బోర్డు రెవెన్యూ కలెక్షన్​వివరాలను డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్​ను అడిగి తెలుసుకున్నారు. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమీక్షలో ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.