
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు : రూ.లక్ష లంచం తీసుకుంటూ మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లాలోని నవభారత్ కో–ఆపరేటివ్ బ్యాంకుకు, అకౌంట్హోల్డర్లు, వారి కుటుంబ సభ్యులకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో వారు సమస్య పరిష్కారం కోసం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాసరాజును సంప్రదించారు.
అందుకు శ్రీనివాసరాజు బాధితుల నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. అకౌంట్హోల్డర్లు, వారి కుటుంబ సభ్యులు రూ.లక్ష ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ప్లాన్ప్రకారం గురువారం కలెక్టరేట్ పార్కింగ్ఏరియాలోని కారులో డబ్బు పెట్టాలని శ్రీనివాసరాజు సూచించాడు.
అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి డబ్బును పట్టుకున్నారు. విచారణలో సదరు కారు తనదేనని, రూ.లక్ష లంచం తీసుకున్నానని అంగీకరించాడు. అనంతరం ఏసీబీ అధికారులు డిప్యూటీ రిజిస్ట్రార్ఇంట్లో, ఆఫీసులో సోదాలు నిర్వహించారు.