
సైంటిస్టులు, రీసెర్చ్ సంస్థలకు కేంద్రం ఆహ్వానం
కేన్సర్, షుగర్ మందులు, షాంపూ, టూత్ పేస్ట్, దోమల బత్తీలు తయారు చేయాలె
ఆవు గొప్పతనాన్ని తెలిపే రీసెర్చ్లు చేయాలె
‘సూత్ర-పిక్ ఇండియా’ ప్రాజెక్టుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
ఆవు పంచకం(మూత్రం)తో కొందరు ఇంటిని శుద్ధి చేస్తరు. కొందరు పొద్దున్నే లేవంగనే గోవు పంచకం తాగుతరు. మరికొందరు కొన్ని రోగాలకు మందుల తయారీలో ఆవు మూత్రాన్ని వాడుతరు. ఇక ఆవు పెండతో ఇప్పటికీ ఊళ్లల్లో వాకిట్లో సామిడి (కళ్లాపి) చల్లుతరు. ట్రెడిషనల్గా ఆవు మూత్రం, పెండకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఎప్పటి నుంచో గట్టి నమ్మకం ఉండటం వల్లే వీటిని తరతరాలుగా వాడుతూ వస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ గోమూత్రం, పెండలోని ఔషధ గుణాలను తెలియజెప్పేందుకు సైంటిఫిక్ గా రీసెర్చ్లు జరగలేదు. అందుకే.. దేశీ ఆవుల మూత్రం, పెండపై రీసెర్చ్ చేసి, వాటిలోని ఔషధ గుణాలను వెలికితీసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న సైంటిస్టులు, రీసెర్చ్ సంస్థలు ప్రపోజల్స్ పంపాలని ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆవుకు ఉన్న ప్రత్యేకతలను సైంటిఫిక్గా తెలియజెప్పేందుకు రీసెర్చ్లు చేయాలని కోరింది. ఎంపికయ్యే ప్రపోజల్స్ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ‘సైంటిఫిక్ యుటిలైజేషన్ త్రూ రీసెర్చ్ ఆగ్మెంటేషన్ ప్రైమ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండిజీనస్ కౌస్ (సూత్ర-–పిక్ ఇండియా)’ ప్రాజెక్టును కూడా కేంద్రం అమలు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ. 98 కోట్లు కేటాయించారని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
దేశీ గోవుల ప్రత్యేకతలపై రీసెర్చ్
ఆవు నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థాలతో షాంపూలు, కండిషనర్లు, ఆయిల్, టూత్ పేస్ట్లు, దోమల బత్తీలు, కేన్సర్, షుగర్ నివారణకు మందులను తయారు చేయడంపై ప్రతిపాదనలు పంపాలని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘దేశీ ఆవుల ఉత్పత్తులను వివిధ రోగాల నివారణ కోసం చాలామంది ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ వీటిపై సైంటిఫిక్గా రీసెర్చ్, స్టడీలు జరగలేదు. అందుకే దేశీ ఆవులు, వాటి ఉత్పత్తుల ప్రత్యేకతలపై సైంటిఫిక్ రీసెర్చ్ చేసేందుకు ప్రపోజల్స్ పంపాలి” అని నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. ఆవు మూత్రం, పెండలో ఉండే రసాయనాలు, వాటి గుణాలను గుర్తించాలని, వాటితో మెరుగైన యాంటీబయాటిక్స్ తయారు చేసేందుకు ఉపయోగపడే బయోయాక్టివ్ సూత్రాలను రూపొందించాలని కోరింది. కేన్సర్, షుగర్ వంటి జబ్బుల నివారణ కోసం ఆవు మూత్రం, పెండలో ఉన్న ఔషధ గుణాలను వెలికి తీయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం వివిధ మినిస్ట్రీల ఆధ్వర్యంలో సూత్ర– పిక్ ఇండియా ప్రాజెక్టును అమలు చేయనుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, డీఎస్ఐఆర్, సీఎస్ఐఆర్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, న్యూ, రెన్యూవెబుల్ ఎనర్జీ శాఖ, ఐసీఏఆర్, ఐసీఎంఆర్లు కలిసి ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి.
ప్రపోజల్స్ అమలుకు ఫండ్స్
దేశీ ఆవుల ఆధారంగా ఉత్పత్తులు తయారు చేసేందుకు ఎంపికయ్యే ప్రపోజల్స్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వమే ఫండ్స్ ఇవ్వనుంది. మస్కిటో రెపెల్లెంట్, ఫ్లోర్ క్లీనర్, టూత్ పేస్ట్, హెయిర్ ఆయిల్, షాంపూలు, కండిషనర్ల వంటి పర్సనల్ కేర్ ఉత్పత్తులపై రీసెర్చ్లకు ఆర్థికంగా సాయం చేయనుంది. ఆవు మూత్రంతో చుండ్రును పోగొట్టే పాలీ హెర్బల్ హెయిర్ కండిషనర్ను తయారు చేయొచ్చని ఇదివరకే పలు రీసెర్చ్లలో తేలిందని కేంద్రం తెలిపింది. ఆవు పెండ వేడిగా ఉంటుందని, దాని నుంచి వచ్చే ఆవిర్లు దోమలను పారదోలుతాయని ఎంతో మంది నమ్ముతున్నారని, అందుకే ఆవు పెండతో దోమలను పారదోలే మస్కిటో రెపెల్లెంట్లు తయారు చేయాలని పేర్కొంది. ‘‘ఇప్పటికీ ఊళ్లల్లో పెండతో సామిడి చల్లుతారు. అలా చల్లితే అక్కడ కీటకాలు ఉండవని చెప్తారు. పెండతో చేసిన అనేక ఉత్పత్తులు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చినా, వీటిపై సైంటిఫిక్ రీసెర్చ్ మాత్రం జరగలేదు” అని కేంద్రం వివరించింది. అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోతోంది.
2017 నాటి ప్రాజెక్టు మూలకు..
దేశీ ఆవుల ఉత్పత్తులపై రీసెర్చ్ కోసం కేంద్ర ప్రభుత్వం 2017లోనూ దృష్టి సారించింది. అప్పట్లో ఆవు మూత్రం, ఇతర పదార్థాలపై పరిశోధనల అంశంపై19 మంది సభ్యులతో ఒక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. పంచగవ్య (ఆవు పెండ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిని కలిపి చేసే మిశ్రమం)పై రీసెర్చ్ చేసి, అందులోని లాభాలను సైంటిఫిక్గా నిరూపించే ప్రాజెక్టులను ఎంపిక చేయాలని ఈ కమిటీకి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఈ అంశంపై మొత్తం50 ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఏవో కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మాత్రం మూలన పడిపోయింది.