- క్లైమెట్ చేంజ్పై ఫిర్యాదు చేసిన రిధిమా పాండే
- తనతో పాటు మరో 15 మంది కూడా..
- 2017లోనూ కేంద్రంపై ఎన్జీటీకి పాండే కంప్లైంట్
మీ అర్థం లేని పనులతో మా బాల్యాన్ని దోచుకుంటున్నారు. మీకెంత ధైర్యం?’ అని సోమవారం జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సులో ప్రపంచ దేశాలను16 ఏళ్ల బాలిక గ్రెటా థన్బర్గ్ నిలదీసింది. వాతావరణ మార్పులను ఏ దేశమూ పట్టించుకోవడం లేదని ఆమెతో పాటు మరో 15 మంది 12 దేశాల చిన్నారులు, టీనేజర్లు యునైటెడ్ నేషన్స్కు కంప్లైంట్ చేశారు. ఈ చిన్నారుల్లో మన ఇండియన్ అమ్మాయి కూడా ఉంది. పేరు రిధిమా పాండే.
2017లోనే ఎన్జీటీకి ఫిర్యాదు
ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన రిధిమా..‘ఫ్యూచర్ను కాపాడడం’ తన మిషన్ అని చెప్పింది. ‘‘నాకు మంచి భవిష్యత్ కావాలి. నా ఫ్యూచర్ను, చిన్నారులందరి భవిష్యత్ను నేను కాపాడాలనుకుంటున్నా’’ అని తెలిపింది. వాతావరణ మార్పులపై రిధిమా ఫిర్యాదు చేయడం కొత్తేం కాదు. 2017లోనే భారత సర్కారును కోర్టుకు లాగింది. క్లైమెట్ చేంజ్పై చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమైందని 2017లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కు తన లీగల్ గార్డియన్ ద్వారా ఫిర్యాదు చేసింది. వాతావరణ మార్పు వల్ల నష్టపోయే దేశాల్లో ఇండియా ఒకటని, కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకునేలా భారత్ను ఆదేశించాలని ఆ ఫిర్యాదులో కోరింది. కార్బన్ బడ్జెట్ను రెడీ చేసుకొని కార్బన్ డై ఆక్సైడ్ను తగ్గించుకోవాలని, క్లైమెట్ రికవరీ ప్లాన్ను దేశం రెడీ చేసుకోవాలని చెప్పింది. రిధిమా పిటిషన్ను విచారణకు స్వీకరించిన ట్రైబ్యునల్.. దానిపై రెండు వారాల్లో స్పందించాలని కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు జారీ చేసింది.
రిధిమాకు బాగా తెలుసు: తండ్రి
‘‘వాతావరణ మార్పుల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో, తన ఫ్యూచర్పై ఎలాంటి ప్రభావం పడుతుందో రిధిమాకు బాగా తెలుసు. దీన్ని ఆపేందుకు ఏదైనా చేయాలనుకుంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేయాలని చెప్పాం’’ అని రిధిమా తండ్రి రాహుల్ చెప్పారు. కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్లోని మూడో ఆప్షనల్ ప్రొటోకాల్ కింద చిన్నారులు యూఎన్కు కంప్లైట్ ఫైల్ చేశారు. ఈ ప్రొటోకాల్ను దేశాలు ఆమోదిస్తే సాయం కోసం ఎవరైనా డైరెక్ట్గా యూఎన్కు ఫిర్యాదు చేయొచ్చు. ఈ16 మంది చిన్నారులు ఐదు దేశాలు అర్జెంటినా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీలపై యూఎన్కు కంప్లైంట్ చేశారు.