
- ముఖ్య నేతలకు టికెట్లు దాదాపు ఖాయం.. మిగతా నియోజకవర్గాల్లోనే వడపోత
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాండిడేట్లను సెలెక్ట్ చేసేందుకు జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. రెండు రోజులపాటు ఎన్నికల కమిటీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులతో వన్ టు వన్ సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్.. బుధవారం తాజ్ కృష్ణాలో స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించారు. అందరి ఫీడ్ బ్యాక్ను పరిశీలించిన తర్వాత.. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం బుధవారం అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి సీల్డ్ కవర్లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాల్సి ఉంది.
కానీ సీడబ్ల్యూసీ సమావేశాలున్న నేపథ్యంలో వాటి సన్నద్ధతపై దృష్టి సారించేందుకు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ను వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యనేతలంతా స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో బిజీ అయితే.. ఏర్పాట్లపై ఎఫెక్ట్ పడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు స్క్రీనింగ్ చేసిన అభ్యర్థులను సీల్డ్ కవర్లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించినా.. సీడబ్ల్యూసీ సమావేశాలు ఉండటంతో పరిశీలించేందుకు వీలు ఉండదని నేతలు భావిస్తున్నట్టు తెలిసింది.
పకడ్బందీగా లిస్టు
అభ్యర్థుల జాబితాను రూపొందించడంలో స్క్రీనింగ్ కమిటీ పకడ్బందీగా ముందుకు వెళ్తున్నది. అడుగడుగునా సీక్రెట్ మెయింటెయిన్ చేస్తూ.. లిస్టు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నది. ఇప్పుడు లిస్టు బయటికొస్తే.. నేతల మధ్య విభేదాలు ముదిరే ప్రమాదముందని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ప్రధాన నేతల టికెట్లు దాదాపు ఖాయమైపోయినట్టేనని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే మిగతా నియోజకవర్గాల్లోనే వడపోత కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సీనియర్ నేతలు మాత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే తుది నిర్ణయమని, వాళ్లు ఏది చెప్తే అదే చేస్తామని చెప్తున్నారు.
ఇంకా చర్చించాల్సినవి ఉన్నయి: మాణిక్ ఠాక్రే
స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయని మాణిక్ రావు ఠాక్రే అన్నారు. డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు ఇచ్చిన సలహాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. మరోసారి అభ్యర్థుల ఎంపికపై సమావేశమవుతామని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలగలేదని, ఆయనతో మాట్లాడానని చెప్పుకొచ్చారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలగలేదు: భట్టి
అభ్యర్థుల ఎంపికకు వేటిని ప్రామాణికంగా తీసుకోవాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. మరోసారి సమావేశమై.. సమ గ్రంగా అభ్యర్థుల జాబితాను రూపొంది స్తామని తెలిపారు. త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలో కీలక నేత అని, ఆయన అలగలేదని వివరణ ఇచ్చారు.
అభ్యర్థుల ఎంపికపై తర్వాతి మీటింగ్లో చర్చిస్తం: ఉత్తమ్
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విధివిధానాలపై చర్చించామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కమిటీ సభ్యులు ఎలాంటి సూచనలు, సలహాలు ఇచ్చారన్నది చూశామన్నారు. వారు చెప్పిన అంశాలపై స్టడీ చేస్తున్నామని చెప్పారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఇదే చర్చించామని, అభ్యర్థుల ఎంపికపై తర్వాతి సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మిత్రుడని, ఆయన్ను కలిసి మాట్లాడుతానని చెప్పారు.