సూర్యాపేట జిల్లా కోదాడలో శనివారం ( సెప్టెంబర్ 19 ) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాపై నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టాటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎల్అండ్టీ, రెడ్డీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, అపోలో, హెచ్ఎంటీ, ఎంఆర్ఎఫ్, ఎమిరేట్స్, ఫ్లిప్కార్ట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పేటీఎం వంటి సుమారు 300 ప్రముఖ కంపెనీలు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్.
తాను చదువుకునే రోజుల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు నిరుద్యోగుల కష్టాలను స్వయంగా అనుభవించానని... యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలోని కంపెనీలు స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని... సుమారు 20 వేల మంది నిరుద్యోగులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్.
ఈ మెగా జాబ్ మేళా ద్వారా దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అన్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని... జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
