Team India Chief Selector: భారత క్రికెట్ నియంత్రణ మౌలిక వ్యవస్థలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవికి స్వస్తి పలికేందుకు సిద్ధమయ్యాడు. సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగే వన్డే, టీ20 సిరీస్ల కోసం ఈరోజు (బుధవారం, సెప్టెంబర్ 17న) ప్రకటించిన భారత జట్లే చీఫ్ సెలెక్టర్గా అగార్కర్కు చివరి సమావేశమని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు కాంట్రాక్ట్ను పొడిగిస్తామని బీసీసీఐ ప్రతిపాదించినప్పటికీ అగార్కర్ దానికి నో చెప్పడం హాట్ టాపిక్గా మారింది.
రోహిత్, కోహ్లీ ఇష్యూనే అసలు కారణం:
* అగార్కర్ గుడ్బై వెనుక అసలు కథ భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఫ్యూచర్ ప్రణాళికలేనని క్రికెట్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
* 2027 వరల్డ్కప్ వివాదం: 2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటంపై గ్యారెంటీ ఇవ్వలేనని అగార్కర్ బహిరంగంగా ప్రకటనలు చేశాడు. కానీ రోహిత్, విరాట్ మాత్రం మెగా టోర్నీలో ఖచ్చితంగా ఆడతామనే పట్టుదలతో ఉన్నారు.
* బీసీసీఐ పెద్దలతో గొడవలు: స్టార్ ఆటగాళ్ల విషయంలో అజిత్ అగార్కర్ వ్యవహరించిన తీరుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో రోహిత్, కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకడానికి కూడా అగార్కర్ కఠిన వైఖరే కారణమనే ప్రచారం జరుగుతుంది. దీంతో బోర్డు పెద్దలతో దూరం పెరగడంతోనే అజిత్ పొడిగింపును తిరస్కరించినట్లు సమాచారం.
టెస్టుల్లో ఘోర పరాజయం:
* 2023 జూలైలో బాధ్యతలు చేపట్టిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ హయాంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది.
ALSO READ : ఆ ఇద్దరినీ తొందరపడి టీమిండియాలోకి తీసుకురావొద్దు
* వైట్ బాల్ విజయోత్సవాలు: 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ చేరడంతో పాటు 2024, 2026 టీ20 ప్రపంచకప్లు, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్లను భారత్ కైవసం చేసుకుంది.
* టెస్టుల్లో చుక్కలు: పరిమిత ఓవర్లలో సక్సెస్ అయినా, సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం భారత జట్టుకి చావుదెబ్బ తగలింది. సొంతగడ్డపై సౌతాఫ్రికా, న్యూజిలాండ్ చేతుల్లో క్లీన్ స్వీప్ అవ్వడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
రేసులో హైదరాబాద్ ప్లేయర్ ప్రజ్ఞాన్ ఓజా:
అజిత్ అగార్కర్ నిష్క్రమణతో తదుపరి చీఫ్ సెలెక్టర్ ఎవరు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్తో పాటు హైదరాబాద్కు చెందిన మాజీ స్టార్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఓజా ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతుండటంతో, అతనికి చీఫ్ సెలెక్టర్గా ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
