నాకు క్యాన్సర్ రాలేదు.. మీడియా కథనాలపై చిరంజీవి  

నాకు క్యాన్సర్ రాలేదు.. మీడియా కథనాలపై చిరంజీవి  

మెగాస్టార్ చిరంజీవి కాన్సర్ బారిన పడ్డారంటూ మీడియాలో పలు కథనాలు ప్రసారమైన సంగతి తెలిసిందే. ఈ వార్తలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మెగాస్టార్‌కు ఏమైందంటూ సినీ పెద్దలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై పలువురు ప్రముఖులు.. ఆయన ఆరోగ్యం గురుంచి ఆరా తీయడంతో చిరు మరోసారి స్పందించారు. తాను ఎలాంటి క్యాన్సర్ బారిన పడలేదని మెగాస్టార్ స్పష్టం చేశారు. తాను చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్లు రాయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు.  

"కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి  మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి  కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non - cancerous polypsని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. 'అలా ముందుగా టెస్ట్  చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో' అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు/ స్క్రీనింగ్ చేయించుకోవాలి' అని మాత్రమే అన్నాను". 
  
"దీన్ని కొన్ని మీడియా సంస్థలు సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో  'నేను  క్యాన్సర్  బారిన పడ్డాను' అని, 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది  వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల  అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు.." అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.