అభిమానిని పరామర్శించిన చిరంజీవి

అభిమానిని పరామర్శించిన చిరంజీవి

ఎవరికి ఆపద వచ్చినా నేనున్నా అంటూ ముందుకొచ్చే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలిసిన వెంటనే వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. అందులో అభిమానులు అయితే.. వెంటనే రంగంలోకి దిగేస్తారు. వారిని ప్రత్యేకంగా కలవడమో.. లేక హైదరాబాద్ పిలిపించడమో చేస్తూ.. వారికి చేతనైంత సహాయం చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న చిరంజీవి చలించిపోయారు. ఆయన్ను హైదరాబాద్ కు పిలిపించుకుని ఓ ఆసుపత్రిలో చేరిపించారు. ఆసుపత్రికి వెళ్లి.. అతడిని పరామర్శించారు. కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.



వివరాల్లోకి వెళితే...
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో నివాసం ఉండే దొండపాటి చక్రధర్... మెగాస్టార్ కు వీరాభిమాని. తన అభిమాన హీరో బాటలోనే సమాజ సేవలో మునిగిపోయారు. పేదలకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఎన్నో కుటుంబాలను, మెగాభిమానుల తరపున ఆదుకున్నారు. కానీ.. ఆయనకు క్యాన్సర్ వ్యాధి సోకింది. గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారు. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియగానే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రప్పించారు. ఒమేగా హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. ఆ ఆసుపత్రికి సోమవారం సాయంత్రం వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే చక్రధర్ కు అండగా ఉంటామని ఆయన కుటుంబసభ్యలకు మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చారు.