కోడ్ వచ్చేలోగా పనులు చేయాలే..

కోడ్ వచ్చేలోగా పనులు చేయాలే..
  •     అభివృద్ధి పనులు పూర్తి చేయాలె
  •     రుణ మాఫీని కంప్లీట్​ చేయాలె
  •     జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​ రెడ్డి

జనగామ, వెలుగు : ఎలక్షన్​ కోడ్​ కూసేలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సభ్యులు గళమెత్తారు. మంగళవారం జిల్లా పరిషత్​ జనరల్​ బాడీ మీటింగ్ జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అడిషనల్​ కలెక్టర్​ సుహాసిని, సీఈఓ అనిల్​ కుమార్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యల గురించి విన్నవించారు.  

సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రోటోకాల్​ ఎందుకు పాటించడం లేదని జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​ రెడ్డి డీఆర్​డీఓ రాం రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. లింగాల ఘన్​పూర్​ జడ్పీటీసీ గుడి వంశీధర్​ రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ ప్రక్రియ పై రైతుల్లో ఆందోళన ఉందన్నారు. జిల్లాలో ఎంతమంది రైతులకు రుణ మాఫీ జరిగిందనే వివరాలు అగ్రికల్చర్​ ఆఫీసర్ల వద్ద లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. 

దీనికి జిల్లా అగ్రకల్చర్​ ఆఫీసర్​ వినోద్​ కుమార్ స్పందించారు. తరిగొప్పుల జడ్పీటీసీ ముద్దసాని పద్మజా రెడ్డి మాట్లాడుతూ.. తరిగొప్పుల కేజీబీవీ నిర్మాణం ఎప్పుడు కంప్లీట్​ చేస్తారని ప్రశ్నించారు. డీఈఓ రాము సమాధానమిస్తూ నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.  కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.