
రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతు రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో మూడు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి తెలంగాణ వైపుగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడతాయని తెలిపింది. శనివారం, ఆదివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.