
సంగారెడ్డి, వెలుగు : కార్పొరేట్ హాస్పిటల్స్తో సమానంగా సర్కార్ హాస్పిటల్స్ను తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ బ్లాక్, మెడికల్ కాలేజీ హాస్టల్ను ప్రారంభించి, 500 పడకల హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఆడిటోరియంలో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్తో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్లో గతంలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లి అప్పులపాలయ్యేవారని, అలాంటి పరిస్థతిని మార్చేందుకు ప్రభుత్వ హాస్పిటల్స్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలని స్టూడెంట్స్కు సూచించారు.
అంతకుముందు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సంగారెడ్డి నియోజకవర్గ లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం సంగారెడ్డి చౌరస్తాలో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించారు. ఆయన వెంట జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, మెదక్ ఎంపీ రఘునందన్రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, కలెక్టర్ పి.ప్రావీణ్య, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రకాశ్రావు ఉన్నారు.