కాంగ్రెస్ పాలన సమయంలో రైతులకు పిల్లను ఇచ్చే పరిస్థితి లేదని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో ఎంత భూమి ఉందని అడిగి మరీ రైతుకు పిల్లను ఇస్తున్నారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్రంలో భూముల రేట్లు, రైతుల ఆస్తులు పెరిగాయని చెప్పారు. రైతు రాజ్యం కేసీఆర్ వల్లే సాధ్యమైందని అన్నారు ఎర్రబెల్లి. కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల పాలన మాకోద్దు.. 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ పాలనే కావాలని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు తాము ఉద్యమం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. రైతుబంధుతో పాటుగా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. రైతులకు కరెంట్ కోసం ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిపారు.
రైతులు పడే తిప్పలు రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు ఎలా తెలుస్తాయని అన్నారు మంత్రి ఎర్రబెల్లి. ముందుగా కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో రైతులకు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారో విశ్లేషణ చేయాలని సూచించారు. రైతులు పండించే ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొంటుందని, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో ధాన్యం పూర్తిగా కొనలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఏపీలో కరెంట్ సరిగ్గా లేక అక్కడి రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.