వోల్వో బస్సుల్లో కరోనా టెస్టులు

వోల్వో బస్సుల్లో కరోనా టెస్టులు
మొబైల్ కరోనా టెస్టింగ్  ల్యాబ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.ఎక్కడిక్కడ శాంపిల్స్ సేకరించడానికి  వీలుగా అత్యాధునిక సదుపాయాలు కలిగిన  20 వోల్వో బస్సులను  ప్రారంభించింది. ఎమర్జెన్సీ  ఉన్న పేషేంట్లను  హాస్పిటల్ కు  తరలించేందుకు  వీలుగా ఈ బస్సులకు అనుబంధంగా వెంటిలేటర్ తో కూడిన 20 అంబులెన్స్ లు కూడా సిద్ధం చేసింది. ఇంటెలిజెన్స్ మానిటరింగ్ ఎనాలసిస్ సర్వీస్  క్వారెంటైన్ టెక్నాలజీతో వెరా స్మార్ట్ హెల్త్ సంస్థ తయారు చేసిన ఈ బస్సులను బుధవారం కోఠిలోని కరోనా కమాండ్  కంట్రోల్ సెంటర్ లో ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. వైద్య శాఖకు 20 వోల్వో బస్సులు,20 అంబులెన్స్ లు అందించేందుకు ముందుకొచ్చిన వెరా స్మార్ట్ హెల్త్ సంస్థ సీఈవో ధర్మతేజ, సీవోవో విజయలను మంత్రి ఈటల అభినందించారు.
ఒక్కో బస్ లో 4 బెడ్స్ 10 కలెక్షన్ కౌంటర్లు

మొబైల్ టెస్టులు, శాంపిల్స్  కలెక్షన్ కోసం వెరా సంస్థ ఈ 20 వోల్వో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో బస్సులో  10 శాంపిల్ కలెక్షన్ కౌంటర్లు ఉంటాయి. 10 మంది టెక్నీషియన్స్ బస్సు లోపలే ఉండి బయట ఉన్న వ్యక్తుల నుంచి నమూనాలు సేకరిస్తారు. ఈ వోల్వో బస్సుల్లో వెంటిలేటర్ సదుపాయం గల చిన్నపాటి ఐసీయూ ఉంటుంది. వీటితో పాటు ఆక్సిజన్  సదుపాయం గల నాలుగు బెడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కంటైన్ మెంట్ జోన్లు, పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో  ఈ బస్సు నుంచే అనుమానితులందరికీ వెంటవెంటనే పరీక్షలు చేయడానికి అవకాశం ఉంటుందని వెరా సంస్థ ప్రతినిధులు చెప్పారు వీటి ద్వారా సుదూర ప్రాంతాల నుంచి  అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషేంట్లను పెద్దాసుపత్రులకు తీసుకరావొచ్చన్నారు. ఈ బస్సు ద్వారా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడానికి  వైద్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
వెంటిలేటర్ ఉన్న 20 అంబులెన్స్ లు కూడా

మరో వైపు 20 వోల్వో బస్సులకు అనుసంధానంగా 20 అంబులెన్స్ లు కూడా అందుబాటులో ఉంటాయి అత్యవసర పరిస్థితి ఉన్న పేషేంట్లను  ఆక్సీజన్ సదుపాయం ఉన్న ఈ అంబులెన్స్ లో దగ్గరలోని ఆస్పత్రికి తరలించవచ్చు. ఏ హాస్పిటల్ లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలుసుకునే  టెక్నాలజీ కూడా ఉండటం వల్ల , బెడ్స్ అందుబాటులో ఉన్న హాస్పిటల్ కు పేషెంట్లను తీసుకవెళ్లడం ద్వారా వారి ప్రాణాలు కాపాడవచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.