రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం కరీంనగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో చేయబోయే పలు అభివృద్ధి పనుల గురించి ఆయన చెబుతూ.. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఆమరణ దీక్షకు బయలుదేరినప్పుడు అరెస్ట్ చేసిన అలుగునూర్ ప్రాంతం వద్ద అద్భుత ఐలాండ్ నిర్మిస్తామని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ కు తోడుగా కుడి వైపు నాలుగున్నర కిలోమీటర్ల నిడివిలో 100 కోట్లతో మానేరు రివర్ బండ్ అభివృద్ధి చేస్తామన్నారు. మానేరు నుంచి చేగుర్తి వరకు 5చెక్ డ్యాములు నిర్మిస్తామని తెలిపారు.
మూడు జోన్లలో 24 గంటల పాటు తాగు నీటి సరఫరాకు ప్రణాళిక రూపకల్పన చేయనున్నట్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. కరీంనగర్ లో ఈ బస్ నడిపేందుకు డీపీఆర్ రూపకల్పన చేశామని చెప్పారు. చారిత్రక కట్టడాల రక్షణకు 3.2కోట్లతో చర్యలు చేపడతామని, సాలీడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ కోసం రూ. 66కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం 5.6కోట్లతో పనులు చేపట్టడమే కాకుండా సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో వరంగల్ కంటే కరీంనగర్ ముందంజలో ఉందని చెప్పారు.
కరోనా కష్టకాలంలో బండి సంజయ్ ఎక్కడి పోయాడు?
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని విమర్శిస్తూ.. స్థానిక ఎంపీ కనపడటం లేదంటూ బావు పేట గ్రామస్తులు ఆందోళన చేయడం చూసైనా ఎంపీ సిగ్గుపడాలని అన్నారు. ఆందోళన పైగా టీఆర్ఎస్ వాళ్ళు చేయించారని బీజేపీ ఆరోపణ చేయడం సిగ్గుచేటు అని అన్నారు. గంగుల కమలాకర్ అలాంటి చిల్లర రాజకీయాలు చేయడని చెప్పారు.