జగనన్న బాణం షర్మిల వస్తుంది..ఆ తర్వాత..

జగనన్న బాణం షర్మిల వస్తుంది..ఆ తర్వాత..

కరీంనగర్ జిల్లా: తెలంగాణలో ఆంధ్రావాళ్లు పార్టీ పెడితే మనకే నష్టమన్నారు మంత్రి గంగుల కమలాకర్. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం కరీంనగర్ నియోజకవర్గంలోని, కొత్తపల్లి మండలం, మల్కాపూర్ లో ప్రారంభించారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ..వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే రాష్ట్రంలో మళ్లీ కొట్లాటలు తప్పవన్నారు. జగనన్న బాణం షర్మిల వస్తోందని..తర్వాత మెల్లగా జగన్ వస్తాడన్నారు. జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని..దీంతో మళ్లీ తెలంగాణలో కొట్లాటలు వస్తాయన్నారు. దీంతో ఇప్పటి నుంచే మనం కేసీఆర్ ను కాపాడుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. లేకపోతే మళ్లీ సమైఖ్య రాష్ట్రం అవుతుందని..ఆంధ్రా నేతలు కరెంటు, నీళ్లు ఎత్తుకపోతారన్నారు.

రాష్ట్రంలో ఎవరు ఎన్ని బాణాలు వదిలినా సీఎం కేసీఆరే మనకు శ్రీరామరక్ష అన్నారు. స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తోనే సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి.. పోయాయి కానీ.. పేద వర్గాల వారికి అండగా ఉండే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు.  కేసీఆరే మన రక్షకుడని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.