కరీంనగర్: బతుకమ్మ పండుగ విశిష్ఠతను వివరించేలా ఈనెల 18న కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం నీళ్లలో లేజర్ షో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. శుక్రవారం కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ వద్ద అదివారం రోజున జరగబోయే “వింగ్స్ ఆఫ్ టైమ్, సింగపూర్” నమూనా వాటర్ ప్రొజెక్షన్, లేజర్, క్రాకర్ షో ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.
గంగులకమలాకర్ మాట్లాడుతూ… గ్రానైట్ అసోసియేషన్ సహాయంతో 30 లక్షలతో ఈ షో ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ లేజర్ షో తిలకించేందుకు రావాలని కోరారు. అంతే కాకుండా నగరానికి అత్యంత సమీపంలో ఉన్న లోయర్ మానేరు రిజర్వాయర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు దృష్టిసారి స్తున్నామని తెలిపారు. ఎల్ఎండీని తిలకించేందుకు కరీంనగర్ పట్టణం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని, దీనికి తోడుగా డ్యాంలో ఏర్పాటు చేసిన బోటింగ్ లో షికారు చేసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు.