ఫైనల్ స్టేజీలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ

ఫైనల్ స్టేజీలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా ద్రువీకరణ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఇదే అంశంపై రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,15,901 అప్లికేషన్ల విచారణ తుదిదశకు చేరుకుందని ఆయన తెలిపారు. అత్యంత త్వరలోనే లబ్దిదారులను గుర్తించి వీలైనంత త్వరగా వారికి కార్డులతో పాటు రేషన్ ఒకేసారి అందించే విదంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గత పదిహేను రోజుల నుంచి రెవెన్యూతో పాటు ఇతర సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతీ అర్హుడిని గుర్తించడం కోసం జిల్లా కలెక్టర్లు, డిసిఎస్వోలు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారని గంగుల అన్నారు. నూతన కార్డుల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడినా సిద్దంగా ఉన్నామని ఆయన అన్నారు. ప్రతీ పేదవాని ఆకలిని తీర్చడానికే సీఎం నిరంతరం కృషి చేస్తారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.