అవతరణ వేడుకలు గ్రాండ్​గా చేయాలి : మంత్రి హరీశ్ రావు

అవతరణ వేడుకలు గ్రాండ్​గా చేయాలి : మంత్రి హరీశ్ రావు

అవతరణ వేడుకలు గ్రాండ్​గా చేయాలి
రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణపై సమీక్షలో మంత్రి హరీశ్
21 రోజుల కార్యాచరణపై ప్లాన్ రెడీ చేయాలని ఆదేశం

హైదరాబాద్,వెలుగు : రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు ప్లాన్ రూపొందించాలని మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు. తొమ్మిదేండ్లలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే 21 రోజుల దశాబ్ది ఉత్సవాల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు సెక్రటేరియెట్​లో శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, ఘనంగా నిర్వహించాలని సూచించారు.

జూన్ 2న హైదరాబాద్​లో నిర్వహించే ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని, జిల్లా కేంద్రాలలో జరిగే ప్రారంభోత్సవాల్లో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి రూపొందించే డాక్యుమెంటరీ చిత్రాల వివరాలను సీఎస్​ శాంతి కుమారి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సాధించిన విజయాలను వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల కార్యాచరణ ప్లాన్​ను వెంటనే సమర్పించాలన్నారు. మంత్రుల ప్రతిపాదనలు, సూచనలపై సమావేశంలో చర్చించి తదుపరి సూచనల కోసం సీఎంకు పంపనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్‌‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, సీహెచ్‌‌ మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌, ఎస్‌‌ నిరంజన్‌‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌‌, ఇంద్రకరణ్‌‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌‌కుమార్‌‌, గంగుల కమలాకర్‌‌, శ్రీనివాస్‌‌ గౌడ్‌‌, సత్యవతి రాథోడ్‌‌ పాల్గొన్నారు.