
హైదరాబాద్, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో అన్ని మందులనూ అందుబాటులో ఉంచుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు బయట కొనుక్కోవాలంటూ పేషెంట్లకు చీటీలు రాసి ఇవ్వొద్దంటూ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. పేషెంట్లకు బ్రాండెడ్ మందులు రాయొద్దని.. జనరిక్ మెడిసిన్స్ మాత్రమే రాయాలని స్పష్టం చేశారు. ఆదివారం వైద్య, విద్య పరిధిలోని ఆస్పత్రుల పనితీరుపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మెటర్నిటీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ సహా అన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ కింద మరింత ఎక్కువగా సేవలు అందించాలన్నారు.
పెద్దాపరేషన్లు పెంచాలె
అన్ని ఆస్పత్రుల్లో ఒక ప్లాన్ రూపొందించుకొని ఆపరేషన్ థియేటర్ వినియోగం పెంచాలని మంత్రి చెప్పారు. ముఖ్యంగా పెద్దాపరేషన్ల సంఖ్యను పెంచాలన్నారు. శానిటేషన్, డైట్ టెండర్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. మార్చురీల ఆధునీకరించాలని, వెంటిలేటర్లు అన్నీ పనిచేసేలా చూడాలని, డయాలసిస్ సెంటర్లపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. డాక్టర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు డ్యూటీలో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు క్లినిక్స్ లో ఉండొద్దని హెచ్చరించారు.
నిజామాబాద్ లోనూ మోకాలిచిప్పల మార్పిడి
మొన్నటివరకు గాంధీ, ఉస్మానియా దవాఖాన్లకే పరిమితమైన మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ లను నిన్న సిద్దిపేటకు, ఈ రోజు నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి విస్తరించామని హరీశ్ తెలిపారు. ఉస్మానియాలో డయాబెటిస్ పేషెంట్లకు కాళ్ల ట్రీట్ మెంట్ కోసం ప్రత్యేక ఫుట్ కేర్ క్లినిక్ ను ప్రారంభించామని చెప్పారు.
మరో రెండు ఆస్పత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్లు
గాంధీ ఆస్పత్రిలో ఇదివరకే ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభించామని, ఇప్పుడు మరో 2 ఆస్పత్రులకు ఈ సేవలను విస్తరిస్తున్నామని హరీశ్ చెప్పారు. కొత్తగా హైదరాబాద్లోని పేట్లబురుజు, వరంగల్లోని ఎంజీఎం దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గాంధీలో త్వరలో క్యాథలాబ్, ఎంఆర్ఐ మెషీన్లనూ ప్రారంభిస్తామన్నారు.